ఆధునిక సమాజంలో సోషల్ మీడియా (Social Media) వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు మైనర్లుగా ఉన్న చిన్నారులపై (Minors) సోషల్ మీడియా వినియోగానికి కఠిన పరిమితులు విధిస్తున్నాయి. అదే నమూనాను ఆదర్శంగా తీసుకుంటున్నామని ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూడా 13 లేదా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కూటమి ప్రభుత్వ నాయకులు గత కొంతకాలంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు.
జనసేన (Jana Sena) ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) శాసనమండలి సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ… 16 ఏళ్లలోపు పిల్లలు సైబర్ నేరాలు, ప్రమాదకరమైన ఆన్లైన్ ట్రెండ్స్ ప్రభావానికి గురవుతున్నారని, వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సోషల్ మీడియాలో మంచి–చెడులను అర్థం చేసుకునే పరిపక్వత చిన్నారులకు ఉండదని, అందుకే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇక హోంమంత్రి అనిత (Anita) కూడా పిల్లల భద్రత దృష్ట్యా సోషల్ మీడియాపై వయోపరిమితి విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) సైతం చిన్నారులను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు కఠిన చట్టాలు తీసుకువస్తామని ప్రకటించారు.
మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కూడా 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విధానాలపై ముసాయిదా చట్టం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలతో పాటు సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, 90 రోజుల్లో చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం… స్వయానా మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్స్ (Devansh) పేరుతో “డైనో డీట్స్” అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించి ప్రచారం చేయడం.
దీంతో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అన్న ప్రభుత్వ ఆలోచన ఇంకా కొనసాగుతుందా? లేక ప్రజలకు ఒక విధానం, తమ కుటుంబాలకు మరో విధానమా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికీ 13 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం అమలు చేయాలనే ఆలోచనలో ఉంటే… అదే సమయంలో అధికార కుటుంబానికి చెందిన చిన్నారి సోషల్ మీడియాలో ప్రవేశించడం ద్వంద్వ వైఖరిగా విమర్శలు ఎదుర్కొనే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.






