సిరియా (Syria) మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు (Bashar al-Assad) ఆ దేశ కోర్టు మరణశిక్ష (Death Sentence) విధించింది. సిరియాలో 14 ఏళ్ల పాటు కొనసాగిన అంతర్యుద్ధం సమయంలో అసద్ ప్రభుత్వం యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నమోదైన కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ అంతర్యుద్ధంలో సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదే కేసులో అసద్ తమ్ముడు, మాజీ సిరియా సైనిక అధికారి మహెర్ అల్ అసద్కు (Maher al-Assad) కూడా కోర్టు మరణశిక్ష విధించింది. అసద్ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి, ఆయన మేనమామ కుమారుడు అతీఫ్ నజీబ్కు (Atif Najib) కూడా ఇదే శిక్షను ఖరారు చేసింది.
2011లో దక్షిణ సిరియాలోని దారా ప్రావిన్స్లో (Daraa Province) రాజకీయ భద్రతా విభాగం అధిపతిగా పనిచేసిన అతీఫ్ నజీబ్పై (Atif Najib) అక్కడ తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యల అనంతరం సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చి, చివరకు తిరుగుబాటు మరియు అంతర్యుద్ధానికి దారితీశాయి.
2024 డిసెంబర్లో ఇస్లామిస్ట్ నేతృత్వంలోని బలగాలు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. తిరుగుబాటు దళాలు డమాస్కస్ను చుట్టుముట్టడంతో అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి సిరియా నుంచి రష్యాకు వెళ్లిపోయారు.
అసద్ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన అతీఫ్ నజీబ్ను ఆ తర్వాత అరెస్ట్ చేశారు. మాజీ ప్రభుత్వానికి చెందిన విచారణ ఎదుర్కొంటున్న అత్యున్నత స్థాయి అధికారుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. అసద్ రష్యాలో(Russia) ప్రవాసంలో ఉన్న సమయంలోనే ఆయనకు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది.








