ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Condition) కాగ్ (CAG) (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన తాజా గణాంకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అమలు సూచికలు చూస్తే.. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) అప్పులు (Debts)చేయడంలో చూపిస్తున్న వేగం, రాష్ట్రానికి ఆస్తులు సృష్టించడంలో లేదా దీర్ఘకాలిక అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంలో కనిపించడం లేదన్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది.
కాగ్ నివేదిక ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులైన అమ్మకపు పన్ను(Sales Tax), రాష్ట్ర జీఎస్టీ(State GST), స్టాంపులు(Stamps), రిజిస్ట్రేషన్ డ్యూటీలు(Registration Duties) వంటి విభాగాల్లో లక్ష్యాలకు తగ్గట్టుగా వసూళ్లు జరగలేదు. రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వేల కోట్ల రూపాయల మేర వెనుకబడ్డాయి.
ఇక రెవెన్యూ వ్యయం మాత్రం భారీగా పెరిగింది. ఉద్యోగుల జీతాలు(Employee Salaries), పెన్షన్లు(Pensions), పరిపాలనా ఖర్చులు పెరుగుతుండటంతో రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడింది. ఫలితంగా రెవెన్యూ లోటు బడ్జెట్ అంచనాలను మించి పెరిగిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ద్రవ్య లోటు పరిస్థితి కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికలాగే కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతుండగా.. వాటి ద్వారా భవిష్యత్కు ఉపయోగపడే ఆస్తుల కల్పన జరగకపోవడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా అప్పులు తీసుకుంటే వాటిని మౌలిక వసతులు, పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఖర్చు చేసి భవిష్యత్లో ఆదాయం వచ్చేలా చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ భాగం అప్పులు రెవెన్యూ ఖర్చులకే వెళ్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగ్ గణాంకాల ప్రకారం బడ్జెట్ అంచనాలతో(Budget Estimates) పోలిస్తే ఆస్తుల కల్పన వ్యయం గణనీయంగా తగ్గింది. రోడ్లు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులు తగ్గిపోవడం వల్ల దీర్ఘకాలిక అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అదేవిధంగా కేంద్ర గ్రాంట్ల విషయంలో కూడా రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదని గణాంకాలు సూచిస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. కేంద్ర సహాయాన్ని సమర్థవంతంగా రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర గ్రాంట్లు, సహాయ నిధులు తగ్గడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడిలోకి నెట్టింది.

ఇక కాగ్ నివేదికలో మరో ముఖ్య అంశం ఏమిటంటే.. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం, వాస్తవంగా వచ్చిన ఆదాయం మధ్య భారీ అంతరం ఉండటం. దీని వల్ల బడ్జెట్ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అప్పులు పెరుగుతున్నా ఆస్తులు పెరగకపోవడం, ఆదాయ వనరులు బలహీనపడటం, కేంద్ర నిధులు తగ్గడం వంటి అంశాలు భవిష్యత్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.






