సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party – CJP) (సీజేపీ) కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై (Modi Government) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. విద్యాశాఖ వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేసింది. జూన్ 13లోగా మంత్రి పదవి వీడకపోతే జూన్ 20న దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని సీజేపీ హెచ్చరించింది.
పూణేలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే (Abhijit Deepke) మాట్లాడుతూ.. దేశంలో పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును (Students Future) ప్రమాదంలోకి నెట్టేశాయని ఆరోపించారు. యువత సమస్యలపై ఇక మౌనం వహించబోదని స్పష్టం చేశారు. ముఖ్యంగా నీట్ పరీక్ష రద్దు (NEET Exam Cancellation) తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు (Suicides) పాల్పడిన ఘటనలు దేశాన్ని కలిచివేశాయని అన్నారు.
నీట్(NEET), సీబీఎస్ఈ(CBSE), సీయూటీ (CUET) వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో తరచూ ఎదురవుతున్న సమస్యల కారణంగా 1 కోట్లకు పైగా విద్యార్థులు ప్రభావితమయ్యారని అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న వ్యవస్థపై దేశ యువత ఆగ్రహంతో ఉందని తెలిపారు.
ఇప్పటికే జూన్ 06న ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జూన్ 11న సాయంత్రం 4 గంటలకు పూణేలో శాంతియుత నిరసన చేపడతామని, ఆ తర్వాత లక్నో, అమృత్సర్, జైపూర్, బెంగళూరు నగరాల్లో కూడా ఆందోళనలు విస్తరిస్తాయని చెప్పారు.
జూన్ 13లోగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే జూన్ 20న దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఢిల్లీకి చేరుకుని భారీ స్థాయిలో నిరసన చేపడతారని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించగలిగితే, తన కేబినెట్లోని విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించడం పెద్ద విషయం కాదని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు.








