తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో నిర్వహించాలని తెలంగాణ జనసేన ప్రణాళిక చేసిన ‘నవనిర్మాణ సంకల్ప సభ’కు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలోని కన్వెన్షన్ వేదికగా జరగాల్సిన ఈ సభకు సంబంధించి జనసేన నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పోలీసులు తమ నిరాకరణకు పలు కారణాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు రాజకీయ నేతల తాజా వ్యాఖ్యలు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే సభకు రెండు వేల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉండగా, తగిన పార్కింగ్ సదుపాయాలు లేవని వెల్లడించారు.
అదనంగా పార్కింగ్ కోసం ప్రతిపాదించిన ఎఫ్సీఐ సొసైటీ లేఅవుట్కు సంబంధించిన స్థలంపై కోర్టులో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కూడా పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.
పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ జనసేన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. సభ నిర్వహణకు అనుమతి లభిస్తుందా లేదా అన్న అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పు జనసేన తదుపరి కార్యాచరణను నిర్ణయించే అవకాశముంది.






