హైదరాబాద్లో నకిలీ వైద్యుల వ్యవహారం కలకలం రేపుతోంది. నగరంలో అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో 11 మంది నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పేర్లతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసుకుని, వాటి ఆధారంగా నగరంలోని పలు ప్రాంతాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
వైద్య రంగంలో ఎలాంటి అర్హతలు లేకపోయినా నిందితులు రోగులకు అల్లోపతి వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా రోగులకు మందులు సూచిస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
నిందితులు నిర్వహిస్తున్న క్లినిక్ల వివరాలు, నకిలీ సర్టిఫికెట్ల కోసం ఉపయోగించిన విశ్వవిద్యాలయాల పేర్లు, రోగులకు అందించిన చికిత్సలు, సూచించిన మందులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
అర్హతలు లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వైద్యుడిని సంప్రదించే ముందు వారి విద్యార్హతలు, వైద్య రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.







