తెలంగాణలో టాక్సిక్ సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయి. యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో బుకింగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఉదయం వరకు బుకింగ్స్ ప్రారంభం కాకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. తాజాగా తెలంగాణలో టికెట్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.
టాక్సిక్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్పై రూ.50, మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఈ పెంచిన టికెట్ ధరలు 10 రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం ఓ కీలక షరతు విధించింది. సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్-మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ రూ.1 కోటిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఖాతాకు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది.
సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో టాక్సిక్ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు నిర్మాతలకు విధించిన ఈ షరతు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







