మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం మరోసారి నిరసనలతో ఉద్రిక్తంగా మారింది. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా తాము చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదారు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కేవలం 10 శాతం బిల్లులు మాత్రమే చెల్లించారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. బిల్లులన్నీ అప్లోడ్ చేసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 18న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది జనసేన కార్యాలయం ఎదుట ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు నిరసనకు దిగడం మొదటిసారి కాదు. 2026 మే 12న కూడా రూ.1,100 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు ఇదే కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు, పాలకులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అప్పట్లోనే వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక గత కొంతకాలంగా జనసేన కార్యాలయం వివిధ వర్గాల నిరసనలకు వేదికగా మారుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్డబ్ల్యూఎస్, సీపీడబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు, కాపు నేతలు, మల్లవల్లి రైతులు, సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు, మత్స్యకారులు, పీఈటీ అభ్యర్థులు, ఉద్యోగులు ఇలా పలు వర్గాలు తమ సమస్యల పరిష్కారం కోసం జనసేన కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టిన ఘటనలు ఉన్నాయి.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అమలు కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను నేరుగా కలిసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో వివిధ వర్గాలు జనసేన కార్యాలయానికి చేరుకుంటున్నాయి.
తాజాగా మరోసారి ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగడంతో, పెండింగ్ బిల్లుల వ్యవహారం మళ్లీ రాజకీయంగా చర్చకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు అమలుకావడంలేదని, కాంట్రాక్టర్ల బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయని? జనసేన కార్యాలయం ఎదుట పెరుగుతున్న నిరసనలతో ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ పరిపాలనా పరంగా వైఫల్యం చెందారని రాజకీయ వర్గాలు సైతం అభిప్రాయ పడుతున్నాయి.








