విజయనగరం (Vizianagaram) జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని ప్రసిద్ధ రామతీర్థం (Ramatheertham) రాములవారి ఆలయంలో (Lord Rama Temple) ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దర్శనం కోసం టికెట్లు తీసుకుని ఆలయంలో వేచి ఉన్న భక్తులను, జనసేన (Jana Sena) నేతల అత్యుత్సాహంతో బలవంతంగా బయటకు పంపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్కడే ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) రామతీర్థం ఆలయ దర్శనానికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇప్పటికే దర్శనం కోసం టికెట్లు తీసుకుని స్వామివారి సేవలో ఉన్న భక్తులను దర్శనం పూర్తికాకముందే బయటకు నెట్టివేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
“నాగబాబు వస్తే సామాన్య భక్తులను (Common Devotees) ఇలా అవమానిస్తారా?”, “టికెట్ (Ticket) తీసుకుని వచ్చిన మాకు రెండు నిమిషాలు కూడా స్వామివారి వద్ద ఉండనివ్వరా?” అంటూ భక్తులు జనసేన నాయకులు, స్థానిక యంత్రాంగాన్ని నిలదీశారు. ఒకవేళ ప్రత్యేక దర్శనం కల్పించాలనుకుంటే ముందుగానే ఆలయాన్ని మూసివేసి ఏర్పాట్లు చేసుకోవచ్చుకదా, టికెట్లు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఇలా బయటకు పంపించడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు, గతంలో అనేక ఇంటర్వ్యూలలో తాను “నాస్తికుడిని”, “గాడ్ అనే కాన్సెప్ట్ను నమ్మను” అని వ్యాఖ్యానించిన నాగబాబు దేవాలయ దర్శనానికి రావడం, ఆయన కోసం భక్తులను బయటకు పంపించడంపై స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. స్వామివారిపై అచంచలమైన భక్తితో వచ్చిన భక్తుల మనోభావాలను ఇది తీవ్రంగా దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై నాగబాబు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






