విశాఖపట్నంలో (Visakhapatnam) పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి (Development) అనే పేరుతో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా ఉత్తరాంద్ర ప్రజల్లో (People of North Andhra) చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భూ కేటాయింపులు కేంద్రంగా మారిన అంశాల ప్రకారం రాష్ట్రంలో అభివృద్ధి నిజంగా జరుగుతుందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రచారం జరుగుతుందా? అన్న సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం, పరిశ్రమల స్థాపన (Industrial Establishment) వంటి అంశాలు అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పేరుతో ప్రకటించిన ప్రాజెక్టులు ఎంతవరకు అమలులోకి వచ్చాయి? వాటి ద్వారా స్థానికులకు ఎంత మేరకు ఉపాధి కలిగింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అభివృద్ధి పేరుతో భూముల కేటాయింపులు(Land Distribution), పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు అమలు చేయడం జరుగుతుండగా, సామాన్య ప్రజలకు లాభం తక్కువగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా విశాఖలో జరుగుతున్న ప్రాజెక్టుల వెనుక ఉన్న ఒప్పందాలు, వాటి పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో విలువైన భూములు పరిశ్రమల స్థాపన మాటున కార్పొరేట్ (Corporate) హస్తాల్లోకి వెళ్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇది ఒక రకమైన ప్రణాళికాబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతలు పరిశ్రమలను ముందుకు పెట్టి ప్రజలను ఏమారుస్తూ భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతూ మరో రూపంలో లబ్ధి పొందుతున్నారనే చర్చ ప్రజల్లో మొదలవడం గమనార్హం.





