రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) మిస్సింగ్ కేసులో (Missing Case) మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్న కృష్ణలంక (Krishnalanka) పోలీస్ స్టేషన్ (Police Station) సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) విచారణలో, మే 1 నుంచి జూన్ 1 వరకు భద్రపరచాల్సిన సీసీటీవీ రికార్డులు కనిపించకుండా పోయినట్లు గుర్తించినట్లు సమాచారం.
దర్యాప్తు అధికారులు పరిశీలించిన రికార్డుల ప్రకారం, నెల రోజుల వ్యవధిలో కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉండగా, మిగిలిన వీడియోలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఫుటేజ్ సాంకేతిక కారణాల వల్ల తొలగించబడిందా? లేక కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను చెరిపివేయాలనే ఉద్దేశంతో మాయం చేశారా? అనే కోణాల్లో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు(CI Nagaraju) పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాయికృష్ణ కేసు దర్యాప్తులో పోలీస్ స్టేషన్ సీసీటీవీ దృశ్యాలు (CCTV Visuals) అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, విధుల్లో ఉన్న పోలీసుల వ్యవహారశైలి వంటి అంశాలపై స్పష్టత ఇచ్చే ఆధారాలు ఇవేనని దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ రికార్డులను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. అయితే మే నెలకు సంబంధించిన ఫుటేజ్ తొలగించబడినట్లు గుర్తించడం మరిన్ని సందేహాలకు దారితీస్తోంది.
ఇక 2020లో జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్(Rohinton Fali Nariman), జస్టిస్ కె.ఎం. జోసెఫ్(K. M. Joseph), జస్టిస్ అనిరుద్ధ బోస్లతో (Aniruddha Bose) కూడిన సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ వ్యవస్థలను తప్పనిసరి చేస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ, ఎన్సీబీ, డీఆర్ఐ, ఎస్ఎఫ్ఐఓ వంటి దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో కూడా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నైట్ విజన్, ఆడియో-వీడియో రికార్డింగ్ సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. కస్టడీలో హింస లేదా మరణం వంటి ఘటనల సందర్భంలో బాధిత కుటుంబాలకు సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని కోర్టు పేర్కొంది.
అయితే దేశవ్యాప్తంగా అనేక కస్టడీ హింస కేసుల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని లేదా ఫుటేజ్ అందుబాటులో లేదని అధికారులు పేర్కొంటున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అదే తరహా పరిస్థితి ఇప్పుడు సాయికృష్ణ కేసులోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం, ఆధారాల భద్రత, దర్యాప్తు పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయికృష్ణ కేసులో సీసీటీవీ ఫుటేజ్ మాయమైన వ్యవహారం ఇప్పుడు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది.






