అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు (Ayodhya Rama Temple Donations Case) దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్(Surya Kant), జస్టిస్ జయమల్య బాగ్చి (Joymalya Bagchi), జస్టిస్ వి. మోహన్లతో (V.Mohan) కూడిన ధర్మాసనం కేసును పరిశీలించింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Tushar Mehta) వాదనలు వినిపిస్తూ, పారదర్శక దర్యాప్తు కోసం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) ఏర్పాటు చేసినట్లు కోర్టుకు వివరించారు.
అయితే ప్రస్తుతం ఉన్న సిట్ను మరింత బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్లో (Forensic Audit) అనుభవం ఉన్న ఒక చార్టర్డ్ అకౌంటెంట్ను (Chartered Accountant) కూడా సిట్లో సభ్యుడిగా చేర్చాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని (UP Government) ఆదేశించింది. కొత్త సిట్కు లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్ (Kiran.S). నాయకత్వం వహించనుండగా, అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ సభ్యులుగా కొనసాగనున్నారు. కోర్టు సూచన మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుడిని చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది.
నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరగాలంటే ఆర్థిక లావాదేవీలను లోతుగా పరిశీలించే నిపుణుల అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆలయానికి వచ్చే విరాళాలు, నిధుల వివరాలను ట్రస్ట్ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అనవసరంగా సంచలనంగా మార్చవద్దని సొలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దర్యాప్తు పురోగతిపై 2 వారాల్లో పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను మరో 2 వారాలకు వాయిదా వేసింది.







