తమిళనాడులో (Tamil Nadu) ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (Tamil Nadu State Marketing Corporation – TASMAC) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4,765 మద్యం విక్రయ కేంద్రాలు కొనసాగుతుండగా, ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు మరియు బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సర్వేలో మొత్తం 717 మద్యం దుకాణాలు నిషేధిత పరిధిలో ఉన్నట్లు తేలింది. వీటిలో 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యా సంస్థల వద్ద, 255 బస్ స్టాండ్ల సమీపంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఆ 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను రాబోయే రెండు వారాల్లో మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించినట్లు వార్తలు వెలువడడంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, మహిళా సంఘాలు మరియు సామాజిక వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) మద్యం దుకాణాల పరిస్థితిపై తిరువూరు తెలుగుదేశం(TDP) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. “అయ్యప్ప స్వామి గుడి, పక్కనే అంబేద్కర్ గురుకులం… ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. తీసేయమంటే బేరం మొదలుపెట్టారు… నెలకు లక్షన్నర… బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో మద్యం దందా (Liquor Mafia) ఎంత తీవ్ర స్థాయిలో కొనసాగుతోందో చెప్పకనే చెబుతున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొలికపూడి శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా తమ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను బహిరంగంగానే ప్రశ్నిస్తూ వస్తున్నారు. అధికార పార్టీలోనే ఉంటూ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేయడం, తన నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా ఆయన పరోక్షంగా రెబల్ నేతగా మారుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఆయన ప్రస్తావించిన అంశాలు కేవలం తిరువూరుకే పరిమితం కావని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని సామాన్య ప్రజలే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.






