అధికార పార్టీగా ఉన్న బలాన్ని ఉపయోగిస్తూ టీడీపీ (TDP) నాయకులు “వర్చువల్ మహానాడు”(Virtual Mahanadu) పేరిట దేవాలయాలు(Temples), ప్రభుత్వ భవనాలు Government Buildings), పాఠశాలలను(Schools) పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయం (Sri Venkateswara Swamy Temple) వద్ద జరిగిన ఘటన భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆలయం చుట్టూ టీడీపీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడమే కాకుండా భక్తులు ప్రదక్షిణలు చేయకుండా అడ్డంకులు సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గుడిలోకి వెళ్లే మార్గంలో కుర్చీలు వేసి, ఆలయ తలుపులు మూసివేసి, స్వామి విగ్రహానికి ఎదురుగా ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని ఉంచి భారీ స్క్రీన్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని ప్రదర్శించడం వివాదానికి దారితీసింది.
స్థానికుల ప్రకారం కొందరు టీడీపీ నేతలు మద్యం సేవించి కార్యక్రమానికి హాజరయ్యారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో “ఇది దేవాలయమా? లేక పార్టీ కార్యాలయమా?” అంటూ భక్తులు మండిపడ్డారు. ఇదే తరహాలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని ప్రభుత్వ యోగా భవనంలో కూడా మహానాడు నిర్వహించినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పెద్దపంజాణి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో (MPDO Office) మహానాడు నిర్వహించడం వివాదాస్పదమైంది. ప్రజా సేవల కోసం ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించడం సరైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయకట్టు ఆరుమాకులపల్లి గ్రామంలోని శ్రీ ఆరుమానిగంగమ్మ ఆలయ ప్రాంగణంలో కూడా భారీ స్క్రీన్లు, జెండాలు, కటౌట్లు ఏర్పాటు చేసి మహానాడు నిర్వహించారు. గుడి ఆవరణ మొత్తం పార్టీ రంగులతో నింపివేయడంపై స్థానిక భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గుడిపాలలో టీటీడీ(TTD) కల్యాణమండపం, తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం సింగనాలత్తూరు ప్రభుత్వ పాఠశాల, అనకాపల్లి జిల్లా కొత్తకోట పాఠశాలలో కూడా మహానాడు కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు రాజకీయ కార్యక్రమాలకు వేదికలుగా మారడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది. “ప్రభుత్వం తమదే కాబట్టి ఏదైనా చేస్తారా?” అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంగా గుడులు, పాఠశాలల వద్ద కోడిపందాలు నిర్వహించిన ఘటనలను గుర్తుచేస్తూ, ఇప్పుడు మహానాడు పేరిట అదే ధోరణి కొనసాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






