రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆలయాల పరిపాలనలో వరుస వివాదాస్పద ఘటనలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆలయ కమిటీలకు చైర్మన్లుగా నియమితులైన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, మద్యం విందులు, వివాహేతర సంబంధాల ఆరోపణలు వంటి అంశాలు ఆలయాల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికార యంత్రాంగం ఈ అంశాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న భావన భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి గుమ్మ వెంకటేశ్వర్లు చైర్మన్గా నియమించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ.. పేకాట ఆడే జులాయికి ఆలయ ఛైర్మన్ పదవి ఇవ్వడమేంటని, పవిత్రమైన పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేయలేదని విమర్శిస్తున్నారు.
ఇది ఒక్క ఘటన మాత్రమే కాకుండా, గతంలో కూడా పలుచోట్ల ఆలయ చైర్మన్లకు సంబంధించిన వివాదాలు బయటపడ్డాయి. విశాఖలో కరక పాలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ రాసలీలల వ్యవహారాలు బహిర్గతం కావడం, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ నియామకంపై ఆ పార్టీ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేయడం, నెల్లూరు జిల్లాలో తమ్మినపట్టణం కోదండ రామస్వామి చైర్మన్ సతీష్ యాదవ్ కామలీలల ప్రవర్తన ఈ సంఘటనలన్నీ ఆలయ పరిపాలన యొక్క చిత్తశుద్ధిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి.
టీటీడీ చైర్మన్కు సంబంధించిన వీడియో వివాదం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే వివాదాల్లో చిక్కుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలపై విశ్వాసాన్ని కాపాడాలంటే బాధ్యులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలను గౌరవించాలని వారు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






