భారత అంతరిక్ష రంగంలో (India Space Sector) 1 చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన దేశపు తొలి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’(Vikram-1) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని (Sriharikota) సతీష్ ధావన్ (Satish Dhawan) అంతరిక్ష కేంద్రం నుంచి ‘మిషన్ ఆగమన్’ (Mission Agaman) పేరుతో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్(India) మరో కీలక మైలురాయిని అందుకుంది. వాణిజ్యపరంగా స్వయంగా రాకెట్లు తయారు చేసి కక్ష్యలోకి పంపగల సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ మరింత బలంగా తన స్థానాన్ని చాటుకుంది.
ప్రయోగ సమయంలో విక్రమ్-1 నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లిన దృశ్యం భారత ఇంజినీర్ల ప్రతిభకు అద్దం పట్టింది. ప్రయోగానికి ముందు స్వల్ప సాంకేతిక కారణంతో కొద్దిసేపు ఆలస్యం జరిగినప్పటికీ, అనంతరం రాకెట్లోని అన్ని దశలు ప్రణాళిక ప్రకారమే పనిచేశాయి. దాదాపు 7 అంతస్తుల ఎత్తుతో రూపొందించిన ఈ రాకెట్ను పూర్తిగా తేలికపాటి కార్బన్ కంపోజిట్ పదార్థంతో నిర్మించారు. భూమికి సమీపంలోని దిగువ కక్ష్యలోకి సుమారు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ముఖ్యంగా రాకెట్ ఇంజిన్లను స్వదేశీ 3డి ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించడం మరో విశేషంగా నిలిచింది.
ఈ తొలి ప్రయోగంలో గృహా స్పేస్ (Gruha Space), కాస్మోసెర్వ్(Cosmoserv), డి-క్యూబ్డ్ (D-Cubed) సంస్థలకు చెందిన సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహాలతో పాటు స్కైరూట్ సంస్థ రూపొందించిన ‘స్కోప్’(SCOPE) ప్రయోగాన్ని కూడా అంతరిక్షంలోకి పంపించారు. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్వహస్తాలతో రాసిన వందేమాతరం పోస్టుకార్డు, ఇస్రో ప్రస్తుత, మాజీ ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, పెట్టుబడిదారులు పంపిన ప్రత్యేక సందేశాలను కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించడం ఈ ప్రయోగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మిషన్ ద్వారా లభించే ఇంజినీరింగ్ డేటా భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాలకు కీలకంగా ఉపయోగపడనుంది.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు విక్రమ్-1 విజయం పెద్ద బలాన్ని ఇచ్చింది. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా 2018లో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించి చిన్న ఉపగ్రహాల ప్రయోగాల్లో తక్కువ ఖర్చుతో నమ్మకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. ఇప్పటికే 2022లో ‘విక్రమ్-ఎస్’తో దేశపు తొలి ప్రైవేట్ సబ్ ఆర్బిటల్ రాకెట్ (First Private Sub-Orbital Rocket) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన స్కైరూట్(Skyroot), ఇప్పుడు విక్రమ్-1 విజయంతో మరోసారి భారత అంతరిక్ష చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.







