చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) వీఎం థామస్ (VM Thomas) చేసిన తాజా వ్యాఖ్యలు అధికార పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీశాయి. టీడీపీ అనుకూల మీడియా తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డ ఆయన, ఎమ్మెల్యేలకు ర్యాంకులు(MLA Rankings) ఇచ్చే హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. టాప్-3 ర్యాంకు కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై ప్రతికూల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తన నియోజకవర్గంలో మాత్రమే మట్టి మాఫియా (Sand Mafia) కనిపిస్తోందా..? చంద్రగిరి(Chandragiri), నగరి (Nagari) వంటి ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించిన థామస్(Thomas), దళితుడినైన (Dalit) తనపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి రంగంలో కోట్ల ఆదాయం వదులుకుని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవలే ఎస్సీ ఎమ్మెల్యేలను(SC MLA) అధికారంలో భాగస్వామ్యం చేయకుండా పక్కన పెడుతున్నారని థామస్ బహిరంగంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎస్సీల ఓట్లు, ఖర్చులు కావాలి కానీ అధికారంలో వాటా ఇవ్వాలంటే మాత్రం తొక్కేస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి.
ఇప్పుడు మీడియా, మట్టి మాఫియా, దళితులపై వివక్ష వంటి అంశాలను ఒకేసారి ప్రస్తావించడం టీడీపీ అంతర్గత విభేదాలను బయటపెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా ప్రభుత్వంలో ప్రజా వనరుల దోపిడీ ఎంత స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్థమవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.






