వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహరచనపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం, కేడర్ బలోపేతం వంటి కీలక విషయాలు కూడా అజెండాలో ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యాచరణపై కూడా సమగ్ర చర్చ జరగనుంది.
పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడం, రానున్న ఎన్నికలకు నాయకత్వాన్ని సిద్ధం చేయడం, కేడర్లో ఉత్సాహం నింపడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.








