ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కీలక ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేకంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలపై పడుతున్న అదనపు భారం, కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందనే విమర్శలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయం వంటి అంశాలపై జగన్ స్పందించే అవకాశముంది. అలాగే ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కూటమి నేతలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు, అమరావతి నిర్మాణ పనుల కోసం తీసుకున్న నిర్ణయాలతో ఏర్పడిన ఇంధన కొరత వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆక్వా రంగాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకుంటోందని ఆరోపిస్తున్న నిర్ణయాలపై కూడా ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం.
ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అధికారికంగా చేస్తున్న పోస్టులను తొలగించేలా కూటమి నేతలు పోలీసులను ఉపయోగించి సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాయిస్తున్నారనే ఆరోపణలపై కూడా జగన్ స్పందించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రెస్మీట్లో జగన్ ఎలాంటి ఆరోపణలు చేస్తారు, ప్రభుత్వానికి ఎలాంటి సవాళ్లు విసురుతారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






