ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) ఉదయ్ కృష్ణారెడ్డిపై (Uday Krishna Reddy) నమోదైన లైంగిక ఆరోపణల కేసు (Sexual Allegations Case) సంచలనంగా మారిన వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదు తర్వాత మోతీనగర్లోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి, ఈరోజు ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు ముందు ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలు, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఇన్స్టాగ్రామ్ స్టోరీ (Instagram Story) ద్వారా పేర్కొన్నారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, నిజం చివరికి తప్పకుండా గెలుస్తుందని తెలిపారు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని, నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ప్రచారం చేయాలని మీడియా, ప్రజలను కోరారు.
కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఆదివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో (Attapur Police Station) ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇక కేసు దర్యాప్తును అత్తాపూర్ పోలీసులు వేగవంతం చేశారు. జాతీయ పోలీసు అకాడమీలో పూర్తి వివరాలు సేకరిస్తున్న అధికారులు, అనంతరం ప్రకాశం జిల్లాలోని ఉదయ్ కృష్ణారెడ్డి స్వగ్రామానికి వెళ్లి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసును హైదరాబాద్ పోలీసు కమిషనర్ (Hyderabad Police Commissioner) ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.








