పరీక్షల్లో అక్రమాలు(Examinations Malpractices), ప్రశ్నాపత్రాల లీకేజీలకు (Question Papers Leakages) అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు-2026’ (Public Examinations Prevention Of Unfair Amendment Bill–2026)కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదం తెలిపారు. ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు.. రాష్ట్రపతి సంతకంతో అధికారికంగా చట్టంగా మారింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను (Gazette Notification) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా నిర్వహించే బహిరంగ పరీక్షల్లో పారదర్శకతను పెంచడం, పరీక్షా విధానంపై విశ్వాసాన్ని బలోపేతం చేయడం, విద్యార్థుల భవిష్యత్తును (Students Future) కాపాడడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా మరింత కఠిన నిబంధనలను ఇందులో తీసుకొచ్చింది.
ఈ బిల్లుకు పార్లమెంట్ (Parliament) ఆమోదం లభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకునే కీలక ప్రక్రియ పూర్తైందన్నారు. పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు.
కొత్త సవరణ చట్టం ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. అదే గ్యాంగ్ లేదా మాఫియా తరహాలో వ్యవస్థీకృతంగా పేపర్ లీక్కు పాల్పడినట్లు నిర్ధారణ అయితే కనిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్లకు తగ్గకుండా భారీ జరిమానా విధించేలా చట్టంలో స్పష్టమైన నిబంధనలు చేర్చారు.








