వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో 26వ స్థానానికి పడిపోయిందనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ నిర్వహించిన స్మార్ట్ పోలీసింగ్ సర్వేలో ఒకప్పుడు నెంబర్ వన్గా నిలిచిన ఏపీ, తాజాగా కేంద్ర హోంశాఖ పనితీరు అంచనాల్లో వెనుకబడిందన్న కథనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
జగన్ హయాంలో 2021లో ఫ్రెండ్లీ పోలీసింగ్, పారదర్శకత, ప్రజల నమ్మకం, సాంకేతిక వినియోగం వంటి అంశాల్లో ఏపీ దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. 2023-24లో సి.ఎస్.డి.ఎస్ మరియు కామన్ కాజ్ సంస్థల సర్వేలో కూడా దేశంలో రెండో ఉత్తమ పోలీస్ వ్యవస్థగా గుర్తింపు పొందింది. అరెస్టుల సమయంలో నిబంధనల పాటింపు, ధర్నాల సమయంలో సంయమనం వంటి అంశాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.
అయితే ప్రస్తుతం పరిపాలనా సంస్కరణలు, నిర్వహణ సమర్థత, సాంకేతిక వినియోగం వంటి విభాగాల్లో ఏపీకి తక్కువ మార్కులు వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హర్యానా, గోవా వంటి రాష్ట్రాలు ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందన్న విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 పోలీసు శాఖల పనితీరుపై కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ 26వ స్థానంలో నిలవడం దారుణమైన పతనం అని చెబుతున్నారు.
రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లు, కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసులు, నిబంధనలకు విరుద్ధమైన అరెస్టులు పెరిగాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పోలీస్ శాఖను రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్నారని, దర్యాప్తు పరికరాల కొరత కూడా పనితీరుపై ప్రభావం చూపుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏపీ పోలీస్ వ్యవస్థ అట్టడుగు స్థాయికి పడిపోయింది అంటే దానికి ప్రధాన కారణం కూటమి నాయకత్వమే అని రెడ్ బుక్ అంటూ పోలీస్ వ్యవస్థలో మితిమీరిన జోక్యంతో వచ్చిన ఫలితమే ఇదని పలువురు ఆరోపిస్తున్నారు.






