జయశంకర్ జయంతి (Jayashankar Birth Anniversary) సందర్భంగా బీఆర్ఎస్(BRS) నేతలు హరీశ్ రావు(Harish rao), కేటీఆర్(KTR) ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా(Telangana Ideologue), రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన జయశంకర్ జీవితమంతా తెలంగాణ రాష్ట్ర సాధనకే అంకితమైందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు.
జయశంకర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు చేరాలనే ఉద్దేశంతో ఆయన జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చిన ఘనత కేసీఆర్కే(KCR) దక్కుతుందని హరీశ్ రావు గుర్తు చేశారు. అలాగే ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ పేరు పెట్టడంతో పాటు ప్రతి సంవత్సరం అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించే సంప్రదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.
జయశంకర్ చూపిన మార్గంలో నడవడం, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు.
తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్… తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్.
— KTR (@KTRBRS) August 6, 2026
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
ఉద్యమ సారథి కేసీఆర్… pic.twitter.com/wbzEEw3Pey
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా ఎక్స్ వేదికగా జయశంకర్ను స్మరించుకున్నారు. “పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా తెలంగాణది” అనే మాటలు జయశంకర్ జీవితానికి సరిగ్గా సరిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడిగా ఆయనను అభివర్ణించారు.
ఉద్యమ సారథి కేసీఆర్కు గురుతుల్యులైన జయశంకర్ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటుతూ ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి అని కేటీఆర్ కొనియాడారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇచ్చిందని మరోసారి గుర్తు చేశారు.






