తమిళనాడులో (Tamil Nadu) కావేరీ జలాల అంశంపై (Cauvery Water Issue) నిర్వహించిన నిరసన సభ రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా కొత్త వివాదానికి కేంద్రబిందువైంది. సభలో ప్రముఖ నటి త్రిష (Trisha) పేరు వినిపించడంతో పాటు డీఎంకే(DMK) నేత, తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది.
కావేరీ నీటి సమస్యపై జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సీఎం విజయ్పై(CM Vijay) విమర్శలు గుప్పించారు. కావేరీ జలాల అంశంపై సీఎం స్పందించడం లేదని, డీఎంకేపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో సభలో కొందరు “త్రిష.. త్రిష” అంటూ నినాదాలు చేయడంతో ఉదయనిధి నవ్వుతూ స్పందించారు.
ఆ సమయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్య డబుల్ మీనింగ్ (Double Meaning) వచ్చేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం ఆయన తాను చెప్పింది కావేరీ నీళ్ల గురించేనని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాజకీయంగా ఈ అంశం మరింత వేడెక్కింది.
ప్రతిపక్ష పార్టీలు రాజకీయ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడుతున్నాయి. ముఖ్యంగా నటి త్రిష పేరును ఈ తరహాలో ప్రస్తావించడం మహిళల(Women’s) పట్ల అవమానకరమని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు తమ వ్యాఖ్యల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ(BJP) కూడా తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి (Narayanan Thirupathy) సోషల్ మీడియా వేదికగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను అసహ్యకరమైనవి, అశ్లీలమైనవి, సిగ్గుచేటైనవిగా అభివర్ణించారు. కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఈ వివాదంపై డీఎంకే అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఉదయనిధి వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. రాజకీయ సభల్లో ఉపయోగించే భాష, మహిళల పట్ల గౌరవం, ప్రజా ప్రతినిధుల బాధ్యత వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో మరింత వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది.







