తమిళనాడులో (Tamil Nadu) విజయ్ ప్రభుత్వం (Vijay Government) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీతో (Assembly) పాటు రాష్ట్రంలో జరిగే అన్ని అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను (Tamil Thai Vazhthu) ముందుగా ఆలపించడం తప్పనిసరి చేస్తూ చట్టం చేసింది. ఈ తీర్మానానికి డీఎంకే(DMK), ఏఐఏడీఎంకేతో (AIADMK) పాటు ఇతర పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇటీవలే వందేమాతరం విషయంలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా చేసిన ఈ చట్టం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ (JCD Prabhakar) మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా (Unanimously) ఆమోదించబడిందని తెలిపారు. దీని అమలుకు ఇకపై ఎలాంటి అదనపు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రకారం విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహా పలు ప్రాంతాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలోనే ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను మొదటగా (First) ఆలపించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడులో తమిళ గీతానికే తొలి ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా హక్కులు, సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లబోదని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో ఉద్వేగభరితంగా మాట్లాడిన ఆయన.. తమిళం తమకు కేవలం ఒక భాష కాదని, అది తమ జీవనాడి, భావోద్వేగం అని పేర్కొన్నారు.
తమిళం అంటే గర్వం, తమిళం (Tamil) అంటే శక్తి అని విజయ్ అన్నారు. మాతృభాష ఎంత పవిత్రమో, తల్లి ఎంత పవిత్రమో తమిళం కూడా తమకు అంతే పవిత్రమైనదని చెప్పారు. తమిళం అనే మాట వినగానే తమిళనాడు మొత్తం ఒక్కటై నిలబడుతుందని పేర్కొన్నారు. ‘తమిళ్ తాయ్ వాజ్తు’కు (Tamil Thai Vazhthu) రాష్ట్రంలో మొదటి స్థానం ఉండాల్సిందేనని, దానికి తొలి ప్రాధాన్యత కల్పించడం తమ హక్కు అని విజయ్ స్పష్టం చేశారు.
కాగా.. ఇటీవల అధికారిక కార్యక్రమాల్లో తమిళ రాష్ట్ర గీతాన్ని చివరగా ఆలపించడంపై వివాదం చెలరేగింది. ఈ ఏడాది మేలో జరిగిన ఓ విశ్వవిద్యాలయ కార్యక్రమంలో తొలుత జాతీయ గీతాన్ని ఆలపించి, ఆ తర్వాత ఇతర గీతాలను ఆలపించి, చివర్లో ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను పాడటంతో పెద్ద దుమారం రేగింది.
ఆ తర్వాత కొన్ని వారాలకే విజయ్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలోనూ ‘తమిళ్ తాయ్ వాజ్తు’(Tamil Thai Vazhthu) మూడో స్థానానికి వెళ్లింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. దీనిపై 21 మంది ఎంపీలు గవర్నర్కు లేఖ రాశారు.
అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను మొదటగా, జాతీయ గీతాన్ని కార్యక్రమం చివర్లో ఆలపించేలా ఆదేశాలు జారీ చేయాలని ఎంపీలు గవర్నర్ను కోరారు. ఈ పరిణామాలన్నింటి మధ్య ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ‘తమిళ్ తాయ్ వాజ్తు’కు రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.








